వరద తాకిడి జిల్లాలకు మంత్రులు, అధికారులు
హైదరాబాద్: వరద తాకిడికి తీవ్రంగా గురైన మూడు జిల్లాలకు వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి డాక్డర్ వైయస్ రాజశేఖర రెడ్డి ముగ్గురు మంత్రులను, ముగ్గురు అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాకు మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, ప్రత్యేకాధికారి బి. ఆర్. మీనా వెళ్లనున్నారు. గుంటూరు జిల్లాకు ఆర్థిక మంత్రి కె. రోశయ్య, ప్రత్యేకాధికారి శశాంక్ గోయల్, ప్రకాశం జిల్లాకు గ్రామీణాభివృద్ధి మంత్రి డి. శ్రీనివాస్, ప్రత్యేకాధికారి ఆర్.యం. గోనెల వెళ్తారు. వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలను వారు పర్యవేక్షిస్తారు.
వరద తాకిడి ప్రాంతాల్లోని రైతులకు విత్తనాలు అందించే విషయమై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వరద తాకిడికి రాష్ట్రంలో మరణించింది 9 మందేనని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో చెప్పారు. తాము ఏర్పాటు చేసిన 556 పునరావాస కేంద్రాల్లో దాదాపు 25 వేల మంది తలదాచుకుంటున్నట్లు ఆయన తెలిపారు.వరద తాకిడి ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి చెప్పారు. కేంద్రం నుంచి సాయం తెప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెడిపోయిన పంట గింజలను వివిధ సంస్థల ద్వారా కొనుగోలు చేయించే ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు.మావోయిస్టుల హత్యాకాండను మంత్రివర్గం ఖండించింది. ఇద్దరు శాసనసభ్యుల సోదరులను మావోయిస్టులు హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.