తెలంగాణలో తెరాస బంద్: ఖమ్మంలో ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బుధవారం విద్రోహ దినాన్ని పాటించింది. తెలంగాణ జిల్లాల్లో బంద్ నిర్వహించింది. పలు జిల్లాల్లో రైళ్లకు, బస్సులకు బ్రేక్లు పడ్డాయి. కరీంనగర్లో బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాజీ మంత్రి హరీష్రావుతో పాటు మరో ఇద్దరు శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో తెరాస కార్యకర్తల బంద్ నిర్వహణ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఆర్ అండ్ బి అతిథిగృహం ముందు తెరాస కార్యకర్తలు నల్లజెండా ఎగురవేశారు. తెరిచి వున్న దుకాణాలను తెరాస కార్యకర్తలు బలవంతంగా మూయించారు. రోడ్డుపై వెళ్తున్న బస్సుల అద్దాలు పగులగొట్టారు. అనంతరం డిపోలోకి వెళ్లి బస్సులపై దాడి చేయడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్రావతరణ దినోత్సవాలను బహిష్కరిస్తూ తెరాస బుధవారం బంద్కు పిలుపునిచ్చింది.
తెరాస నాయకులు, కార్యకర్తలు బస్సు డిపోల వద్ద బైఠాయించి ప్రదర్శ నిర్వహించారు. వరంగల్ జిల్లా కాజీపేటలో ఆందోళనకారులు ఎపి ఎక్స్ప్రెస్ను 20 నిమిషాల పాటు ఆపేశారు. అదే విధంగా మహబూబ్నగర్ - కర్నూలుల మధ్య తుంగభద్ర రైలు ఎక్స్ప్రెస్ను తెరాస కార్యకర్తలు కాసేపు ఆపేశారు. వరంగల్లో సూచన మేరకు రెండు గంటల పాటు అన్ని ప్రాంతాలకు బస్సులను నిలిపేశారు. నిజామాబాద్లో తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి, బోధన్ వంటి ప్రాంతాలకు కూడా అరకొరగా బస్సులు నడిచాయి. నల్లగొండ ఆర్టీసి బస్సు డిపో ముందు శాసనసభ్యుడు నగేష్ నేతృత్వంలో ప్రదర్శన నిర్వహిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో బస్సు డిపోల వద్ద తెరాస కార్యకర్తలు బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి. హైదరాబాద్లో శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బంద్ జరిగింది. హైదరాబాద్లోని పలు కార్పోరేట్ కాలేజీలు సెలవులు ప్రకటించాయి.