వరద ప్రాంతాల్లో వైయస్ పర్యటన రద్దు
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పర్యటన రద్దయింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఆయన బుధవారం ఏరియల్ సర్వే జరపాలని నిర్ణయించుకున్నారు. అయితే భారీ వర్షాల వల్ల వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా లేదు. వరద తాకిడి జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. మచిలీపట్నం ఇంకా జలదిగ్బంధంలోనే వుంది. గుడివాడ, మచిలీపట్నం మధ్య రైల్వే ట్రాక్పై నీరు నిలిచి వుంది. పెడన వద్ద రోడ్డుపై నీరు చేరింది. దీంతో రైళ్లతో పాటు బస్సులు కూడా నడవడం లేదు. బుడమేరు పొంగిపొర్లుతుండడంతో కొల్లేరుకు వరద నీటి ఉధృతి పెరిగింది. దివిసీమ కకావికలమైంది.
విజయవాడలో పరిస్థితి దీనంగా వుంది. బలహీనమైన ఇళ్లు కూలిపోతున్నాయి. కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలు ఇప్పటికీ నీటనే మునిగి వున్నాయి. కృష్ణా జిల్లాలో వలకట్ల కోసం వెళ్లిన ఇద్దరు జాలర్లు గల్లంతయ్యాయి. పలు వంతెనలు కూలిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు మండలంలోని రెండు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చీరాలలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ నీట మునిగింది. దీంతో చీరాల ప్రజలకు నీళ్లు లభించడం లేదు. పాత చీరాలలో నీరు నిలిచి వుంది.