అనంత జైల్లో సూరి రాజభోగాలు: రాంమోహన్ రెడ్డి
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరి అనంతపురం జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడని అప్రూవర్గా మారడానికి సిద్ధపడిన రాంమోహన్ రెడ్డి ఆరోపించారు. జైల్లో సూరి యథేచ్ఛగా సెల్ఫోన్ వాడుతున్నాడని ఆయన అన్నారు. జైలు అధికారులే సూరికి సెల్ఫోన్ అందించారని ఆయన చెప్పారు. సూరి వ్యవహారాన్ని పోలీసులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. నలుగురి నుంచి తన ప్రాణాలకు ముప్పు వుందని ఆయన మొర పెట్టుకున్నారు.
పరిటాల రవి హత్య కేసులో రాంమోహన్రెడ్డిని అప్రూవర్గా మారడానికి అనుమతించాలని సిబిఐ కోర్టుకు విన్నవించుకుంది. అయితే అలా అనుమతించకూడదని డిఫెన్స్ న్యాయవాది కోరారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత అప్రూవర్గా మారడానికి అనుతించకూడదని ఆయన వాదించారు. జైల్లో తాను సెల్ఫోన్లు వాడటం లేదని మద్దెలచెర్వు సూరి చెప్పాడు. తనపై రాంమోహన్ రెడ్డి చేసిన ప్రకటనలు నిరాధారమని ఆయన అన్నాడు. పరిటాల రవి హత్య కేసులో రాంమోహన్ రెడ్డిని సిబిఐవారే ఇరికించారని ఆయన అభిప్రాయపడ్డాడు.