తొలగని జలగండం: మృతులు 27 మంది
హైదరాబాద్: కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఇంకా వరద తీవ్రత నుంచి కోలుకోలేదు. పైగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు పడుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 27కు చేరుకుంది. కృష్ణాజిల్లాలోని నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు తదితర ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మచిలీపట్నం ఇంకా నీటిలోనే వుంది. గుడివాడ, హనుమాన్జంక్షన్ మధ్య ఇంకా నీరు చేరి వుంది. దీంతో గురువారంనాటికి వరుసగా నాలుగో రోజులు రాకపోకలు స్తంభించాయి.
బుడమేరు పొంగిపొర్లుతోంది. కొల్లేరులోకి నీరు చేరడం లేదు. దీంతో నీరు ఎగదన్ని గ్రామాలకు ముప్పుగా పరిణమించింది. దాదాపు 20 గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోల్లేరులో నీటి ఉధృతి ప్రమాదకరంగానే వుంది. బందరు మండలంలోని కొన్ని గ్రామాల్లో నీరు పెరుగుతోంది. నందివాడ వద్ద బుడమేరుకు గండి పడింది. దీంతో కొన్ని గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదపాడు మండలంలోని 8 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుంటూరు జిల్లాలో 225 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లి వుంటుందని ఒక అంచనా. తెనాలి, రేపల్లెల్లో భారీ వర్షాలు కురిశాయి.