మంత్రి రోశయ్యకు తీవ్ర అస్వస్థత: విశ్రాంతి
గుంటూరు: ఆర్థిక మంత్రి కె. రోశయ్య గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు చీరాల గెస్ట్హౌస్లోనే చికిత్స చేస్తున్నారు. విశ్రాంతి లేకపోవడం వల్ల బ్లడ్ ప్రెష్ పెరిగి ఆయన అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. ఆయన గత రెండు రోజులుగా వరద బాధితులను పరామర్శిస్తూ వారికి అందిస్తున్న సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ప్రస్తుతం గెస్ట్హౌస్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
గురువారం ఉదయం రోశయ్య కళ్లు తిరిగి గెస్ట్హౌస్ వద్దనే పడిపోయారు. దీంతో ఆందోళన చెందిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు వైద్యులను పిలిపించారు. వైద్యులు ఆయనను పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. రోశయ్యకు వచ్చిన పెద్ద ప్రమాదమేమీ లేదని, విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలా జరిగిందని వైద్యులంటున్నారు. అయితే రోశయ్య చెంతకు ఎవరినీ వెళ్లనీయడం లేదు. గుంటూరు జిల్లాలో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఇక్కడికి వచ్చారు.