పూరి జగన్నాధ ఆలయంలో నలుగురి మృతి
పూరి: ఒరిస్సాలోని ప్రఖ్యాత పూరి శ్రీ జగన్నాధ దేవాలయంలో శనివారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో నలుగురు చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కార్తీకమాసంలో శనివారంనాడు ప్రదోష దర్శనంకోసం ఒక్కసారిగా జనం దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. అప్పటికి భద్రతా సిబ్బంది పెద్దగా మందిరంలోకి రాలేదు. దర్శనంకోసం వచ్చిన వారిని అదుపు చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగింది. 12వ శతాబ్దిలో నిర్మించిన మందిరం శనివారం సుప్రభాతసేవ తర్వాత ప్రదోషపూజ, మంగళహారతి జరుగుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని దేవాలయ ప్రధాన నిర్వహణాధికారి సురేశ్ మహాపాత్ర తెలిపారు. సాధారణంగా తెల్లవారుజామున మంగళహారతి సమయంలో జనం పెద్దగా రారని, అందువల్ల ఇంత పెద్దసంఖ్యలో జనం వస్తారని తాము ఊహించలేదని మహాపాత్ర తెలిపారు.
పూరి మందిరంలో ఐదురోజులపాటు మాంసాహారాన్ని హిందూ దేవాలయాలకు సమర్పించే ఆచారం ఉంది. దీనిని పంచుక ఉత్సవం అంటారు. పంచుక ఉత్సవం, ప్రదోష దర్శనం సందర్భంగా ఈ పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. చాలామంది భక్తులు ఝలానా మండపంలో నిల్చుని లోపలి తలుపులు తెరిచేందుకు ఎదురుచూశారని, ఒక్కసారి లోతలుపులు తెరుచుకోవడంతో దూసుకెళ్ళారని ప్రత్యక్షసాక్షి తెలిపారు.