అమితాబ్ బచ్చన్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం
న్యూఢిల్లీ: బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ను ఢిల్లీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. అమితాబ్ బచ్చన్ 60వ దశకంలో ఇదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసారు. భారతీయ సినిమాకు అమితాబ్ అందించిన విశిష్టసేవలకు గుర్తింపుగా ఢిల్లీ యూనివర్సిటీ ఆయనకు లిటరేచర్లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్, ప్రసిద్ధ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావు లకు కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ దీపక్ ఫెంటల్ గౌరవ డాక్టరేట్లతో గౌరవించారు.
అమితాబ్ బచ్చన్కు డాక్టరేట్ ప్రదాన ఉత్సవంలో ఆయన 1962లో బిఎస్సి డిగ్రీ చేసిన కిరోరిమల్ కాలేజ్ విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ సతీమణి జయబచ్చన్, పిల్లలు అభిషేక్ బచ్చన్, శ్వేత, సమాజ్వాది నాయకుడు అమర్సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ గత స్మతులను నెమరువేసుకున్నారు. తనకు జరిగిన సత్కారం మొత్తం ఫిల్మ్ పరిశ్రమకు చెందుతుందని పేర్కొన్నారు. మిరండా హౌస్ (బాలికల కాలేజి)లో తాము ఆడిన తొలినాటకాన్ని, వేసిన పాత్రను గుర్తుచేసుకున్నారు. తన తండ్రి సాహిత్యంలో అధ్యాపకుడు, పండితుడని, ఆయన తాను ఆర్ట్స్ తీసుకోవాలని భావించారని, తాను ఆర్ట్స్ తీసుకోలేదని, సైన్స్ చదవాలని కోరుకున్నానని వివరించారు. పారిశ్రామికవేత్త రతన్టాటా, చరిత్ర పరిశోధకులు రోమిలా ధాపర్, రచయిత మహాశ్వేతదేవిలకు కూడా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది కానీ, వారు ఈ కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు.