వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: బాబు
మచిలీపట్నం: రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరారు. వరద వల్ల రెండు వేల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. వరద తాకిడికి గురైన మచిలీపట్నంలో ఆయన ఆదివారంనాడు పర్యటించి బాధితులను పరామర్శించారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్పవార్ రాష్ట్రంలోని వరదతాకిడి ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మొక్కుబడి పర్యటనలు కాకుండా వరద ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టాన్ని తక్కువ చేసి చూస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, మంత్రులు వరద పరిస్థితులను తేలికగా తీసుకుంటున్నారని, వారిని బట్టే అధికారులు కూడా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని పంటల బీమా పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. మలిచీపట్నం మానికొండలో పార్టీ ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి వంశీమోహన్ను ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.