పాత పుస్తక దుకాణాల తొలగింపుతో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్లోని కోఠీలో ఫుట్పాత్లపై గల పాత పుస్తకాల దుకాణాల తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారి తీసింది. పుస్తకాల దుకాణుదారులు తొలగింపును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు ఫుట్పాత్ మీది దుకాణాలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. తమకు కొంత సమయం ఇవ్వాలని దుకాణుదారులు చేసిన విన్నపాలను అధికారులు పట్టించుకోలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. రాజ్యసభ సభ్యుడు పి. మధు నేతృత్వంలో వామపక్షాల కార్యకర్తలు దుకాణుదారులకు మద్దతుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తమకు తగిన ప్రత్యామ్నాయం చూపించకుండా దుకాణాలు తొలగించడం అన్యాయమని వ్యాపారులు అంటున్నారు. తమకు గడువు కూడా ఇవ్వలేదని వారు విమర్శిస్తున్నారు. తమకు ఆదివారంనాడే నోటీసులు అందాయని, ఒక్క రోజులో ఖాళీ చేయడం ఎలా సాధ్యమవుతుందని కూడా వారంటున్నారు. హైదరాబాద్లోని కోఠీ ప్రాంతం పాత పుస్తకాల దుకాణాలకు పెట్టింది పేరు. చాలా అరుదైన పుస్తకాలు తక్కువ ధరకు ఈ ఫుట్పాత్లపై దొరుకుతుంటాయి. ప్రతీ ఆదివారం పుస్తక ప్రియులు ప్రత్యేకంగా ఈ ఫుట్పాత్ల మీద పుస్తకాల వేట సాగిస్తుంటారు.