ఈనాడు సంస్థలపై పైస్థాయిలో కుట్ర: దత్తాత్రేయ
మహబూబ్నగర్/ విజయవాడ: ఈనాడు గ్రూపు సంస్థలకు చెందిన మార్గదర్శి ఫైనాన్సియర్పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన ఆరోపణలు కేంద్ర స్థాయిలో జరిగిన కుట్ర అని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను బయటపెడుతున్నందుకే ఈనాడు సంస్థలపై కక్ష గట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన బుధవారం మహబూబ్నగర్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఏవైనా లోపాలుంటే విచారణ జరిపి చర్య తీసుకోవాలి గానీ డిపాజిటర్లను గందరగోళపరిచే ప్రచారాలు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇంత పెద్ద వివాదం చేయడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చీఫ్ విప్ కిరణ్కుమార్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు వైయస్ వివేకానందరెడ్డి అక్రమ భూ ఆక్రమణలపై నోరు విప్పని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మార్గదర్శిపై ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన అడిగారు.
అతివృష్టి, అనావృష్టి వల్ల అపార నష్టం సంభవించినా రాష్ట్రానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆయన వ్యాఖ్యానించారు. వరద తాకిడి ప్రాంతాల్లో నష్టపోయిన పంటలకు ఎకరానికి ఐదు వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక తెలంగాణకు రిఫరెండం కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు రిఫరెండం అని ఆయన అన్నారు. రెండేళ్లు కేంద్ర మంత్రిగా వుండి చంద్రశేఖరరావు కరీంనగర్ నియోజకవర్గంలో ఏమీ చేయలేదని ఆయన అన్నారు. కెసిఆర్ నియోజకవర్గం ప్రజలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.