మార్గదర్శిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: వైయస్
న్యూఢిల్లీ: ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్పై తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ చేసిన ఫిర్యాదుపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. అరుణ్కుమార్ చేసిన ఫిర్యాదును పరిశీలించాల్సి వుందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బొబ్బిలి లోక్సభ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కూడా ఇంకా ఈ నిర్ణయమూ తీసుకోలేదని ఆయన చెప్పారు.
మార్గదర్శి ఫైనాన్సియర్ నష్టాల్లో కూరుకుపోయిందని ఉండవల్లి అరుణ్కుమార్ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను రామోజీరావు ఖండించారు. ఖాతాదారుల్లో విశ్వాసాన్ని నిలబెట్టి పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నంతో పాటు ప్రభుత్వం కావాలని తమపై దాడికి దిగుతోందని చెప్పే ప్రయత్నం మార్గదర్శి నుంచి జరుగుతోంది. 1100 కోట్ల రూపాయల నష్టం నిజమేనని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ అన్నారు. తమ ఆస్తుల ముందు ఆ నష్టం ఎంత అని కూడా ఆమె ప్రశ్నించారు. కాలపరిమితి ముగిసిన డిపాజిట్లకు చెల్లింపులు జరుపుతామని ఆమె చెప్పారు.