రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్న అఫ్జల్
న్యూఢిల్లీ: పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడిన మొహమ్మద్ అఫ్జల్ గురు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్కు పిటిషన్ పెట్టుకున్నాడు. అఫ్జల్ తన 102 పేజీల మెర్సీ పిటిషన్ను తీహార్ జైలు అధికారులకు బుధవారం సాయంత్రం అందజేశాడు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు న్యూఢిల్లీలో పిటిఐ వార్తాసంస్థకు తెలియజేశాయి. ఈ పిటిషన్ను 75 పేజీల అనుబంధంతో జైలు అధికారులు రాష్ట్రపతికి సమర్పిస్తారు.
తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదంటూ అఫ్జల్ మెర్సీ పిటిషన్ పెట్టుకోవడానికి తొలుత నిరాకరించాడు. ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రపతిని కలిసి క్షమాభిక్ష పెట్టాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సిద్ధాంత విభేదాలను విస్మరించి తనకు లభించిన సంఘీభావానికి తాను కదిలిపోయానని అఫ్జల్ గురు ఆ మెర్సీ పిటిషన్లో అన్నాడు. ఈ మద్దతు తాను ఇంకా జీవించగలనని, తన కుమారుడు ఎదగడాన్ని కళ్లారా చూడగలనని ఆశ చిగురించినట్లు ఆయన తెలిపాడు. తన భార్యను, తన తల్లిని రాష్ట్రపతి కలిసినతీరు తనను చలింపజేసిందని, తనకు న్యాయం జరుగుతుందని ఆశ పుట్టిందని ఆయన అన్నాడు.