విశాఖలో ఆర్టీసి బస్సు మాయం: తుని వద్ద ప్రత్యక్షం
విశాఖపట్నం: సాలూరు డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఒకటి బుధవారం రాత్రి మాయమై గురువారం ఉదయం తుని సమీపంలో కనిపించింది. ఈ బస్సు విశాఖపట్నం ద్వారకానగర్లోని బస్ స్టాండు నుంచి రాత్రి పదకొండున్నర ప్రాంతంలో కనిపించకుండా పోయింది. సాలూరు నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపేసి రెస్ట్ రూమ్కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి బస్సు కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికాడు. ఆ తర్వాత అధికారులకు తెలియజేశాడు.
అధికారులు బస్సు మాయమైన విషయంపై విశాఖపట్నం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే అన్ని డిపోల మేనేజర్లను అప్రమత్తం చేశారు. ఈ బస్సు రాత్రి విశాఖపట్నం డిపోలో ఉండి తెల్లారి సాలూరుకు బయలుదేరాల్సి వుంది. బస్సును ఎవరు తీసికెళ్లారు, ఎందుకు తీసికెళ్లారనేది తెలియడం లేదు. ఇదివరకు కూడా సాలూరు డిపోకు చెందిన బస్సు ఒకటి మాయమైంది. అప్పుడు మతిస్థిమితం లేని మాజీ డ్రైవర్ ఒకతను బస్సును తీసికెళ్లాడు.