భారీ ఎన్కౌంటర్: 9 మంది మావోయిస్టుల మృతి
కడప: రాష్ట్రంలో మావోయిస్టులు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు. మరణించినవారిలో మావోయిస్టు రాయలసీమ డివిజన్ కార్యదర్శి రాఘవులు అలియాస్ అప్పారావు అలియాస్ ఓబులేసు ఉన్నట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక ఎకె 47 రైఫిల్ దొరకడం వల్ల అలా భావిస్తున్నారు. ఎకె 47 రైఫిల్ ఉండడమే అలా భావించడానికి కారణం. ఎకె 47 రైఫిల్ రాష్ట్ర కమిటీ సభ్యుల వద్దనే వుంటుంది. ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడు కూడా. ఈ ఎన్కౌంటర్లో ఓబులేసు భార్య దళ కమాండర్ ప్రశాంతి కూడా మరణించింది.
ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల్లో ఐదుగురు మహిళలున్నారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలం బద్వేలుకు చాలా దూరంలో నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దుల్లో వుంది. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకె 47 రైఫిల్, మూడు ఎస్ఎల్ఆర్ గన్లతో పాటు 12 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కిట్బ్యాగ్లు కూడా లభించాయి. మావోయిస్టులు బస చేశారనే సమాచారంతో పోలీసులు గత కొద్ది రోజుల నుంచి తీవ్రంగా గాలింపు జరుపుతున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు చెబుతున్నారు.మృతుల్లో కడప జిల్లా కమిటీ సభ్యుడు అశోక్, మావోయిస్టు అనంతపురం జిల్లా కమిటీ కార్యదర్శి మల్లికార్జున్ కూడా వున్నట్లు తెలుస్తోంది. ఓబులేషు త్వరలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాల్సి వుండిందని అంటున్నారు.