నేను మాట్లాడినప్పుడు కెసిఆర్ పుట్టలేదు: కెకె
నిజామాబాద్: తాను తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పుట్టలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ గురించి తాను తమ పార్టీ అధిష్ఠానవర్గంతో మాట్లాడినప్పుడు తెరాస పుట్టలేదని ఆయన అన్నారు. అయినా తాను తెరాసను చంకనేసుకుని మద్దతు పలికానని ఆయన అన్నారు. కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక ప్రచారానికి శుక్రవారం ఉదయం బయలుదేరుతూ మధ్యలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను తెలంగాణకు కట్టుబడి వున్నానని ఆయన స్పష్టం చేశారు.
ఛూమంతర్ అంటే తెలంగాణ రాదని ఆయన అన్నారు. కలిసిపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, దానివల్లనే తాను తెరాసను కలుపుకుని వెళ్లేందుకు తాను ప్రయత్నించానని ఆయన అన్నారు. అందుకే ఎవరు తనపై విమర్శలు చేసినా తాను తప్పు పట్టలేదని ఆయన చెప్పారు. శాసనసభ ఎన్నికల్లో తెరాసకు 26 సీట్లకు మించి రావని తెలిసినా తమ పార్టీవారి మెడలు కోసి 42 సీట్లు ఇచ్చామని, ఆ రకంగా తాము త్యాగం చేశామని ఆయన అన్నారు. తెరాస తమకు పోటీయే కాదని, కరీంనగర్ ఎన్నికలో తమ పార్టీ గెలుపు ఖాయమని, గంభీరరావు పేట ఎంపిటిసి గెలుపే అందుకు నిదర్శనమని ఆయన అన్నారు. కరీంనగర్ ఉప ఎన్నిక రావడానికి తానే కారణమనే వ్యాఖ్యలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.