ప్రపంచ జూనియర్ ఫైనల్లో హైదరాబాదీ సైనా
ఇంచియాన్: దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరుగుతున్న ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ ఫైనల్కు చేరుకుంది. ఆమె కొరియా క్రీడాకారిణి బే యూన్ జూను ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత బాడ్మింటన్ క్రీడలో ఒక మెట్టు మాత్రమే దిగువన వుంది. ఫైనల్లో విజయం సాధిస్తే ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టిస్తుంది. 32వ ర్యాంకు సైనా నెహ్వాల్ కొరియా క్రీడాకారిణిని 25 - 23, 21 - 13 స్కోర్తో ఓడించి ఫైనల్కు చేరుకుంది. కేవలం 35 నిమిషాల్లో సైనా విజయాన్ని సొంతం చేసుకుంది.
ఫైనల్లో ఆమె చైనాకు చెందిన వాంగ్ యిహాన్ను శనివారంనాడు ఎదుర్కుంటుంది. యిహాన్ సెమీ ఫైనల్లో కొరియాకు చెందిన కిమ్ మూన్ను ఓడించింది. 16 ఏళ్ల సైనా దూకుడుగా ఆడి సెమీ ఫైనల్లో విజయం సాధించింది. ఇది మంచి పోరు అని, మొదటి గేమ్ చాలాసేపు కష్టంగా సాగిందని, అయితే తాను సహనంతో ఆడి గెలిచానని సైనా అన్నది. ఫైనల్కు చేరుకోవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని, తన ఆటతీరు పట్ల తనకు సంతృప్తి మిగిలిందని, తాను టోర్నమెంట్లో బాగా ఆడానని, ఫైనల్లో కూడా అదే స్ఫూర్తితో ఆడుతానని ఆమె చెప్పింది.