దీక్ష విరమించిన డబ్బింగ్ కళాకారులు
హైదరాబాద్: డబ్బింగ్ చిత్రాల విడుదలను నిషేధిస్తూ రాష్ట్ర చలనచిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడు రోజులుగా దీక్ష సాగిస్తున్న డబ్బింగ్ కళాకారులు, రచయితలు, నిర్మాతలు శనివారంనాడు తమ దీక్షను విరమించుకున్నారు. ఈ విషయమై తమతో చర్చించవలసిందిగా ముఖ్యమంత్రి నుంచి కబురు కూడా డబ్బింగ్ కళాకారులకు అందినట్లు తెలిసింది.
డబ్బింగ్ చిత్రాల తాకిడి పెరిగిపోతుండటంతో తెలుగులో నిర్మిస్తున్న చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదంటూ డబ్బింగ్ చిత్రాలను నిషేధిస్తున్నట్లు తెలుగు నిర్మాతల మండలి ఇటీవల ఒక తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని ఫిలిం ఛాంబర్లోని ఇతర విభాగాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు. డబ్బింగ్ కళాకారులైన రవిశంకర్, అనువాద చిత్రాల రచయితలు వెన్నెలకంటి, శ్రీరామకృష్ణ, భారతీబాబు తదితరులు తమకు ఉపాధి కోల్పోతుందంటూ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు మద్దతు ప్రకటించారు. అయితే ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామంటూ ఏపి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు విశ్వనాథ్ హామీ ఇచ్చి, నిమ్మరసం అందించడంతో ఆందోళనకారులు తమ దీక్షను విరమించుకున్నారు.