సిపిఐ నేత నారాయణ అరెస్టుపై నిరసన వెల్లువ
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కంబారిగాంలో పేదల భూ ఆక్రమణ వ్యవహారంలో అరెస్టయిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు ఈ నెల 25 తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను సబ్ జైలుకు తరలించారు. నారాయణ అరెస్టుకు నిరసనగా సిపిఐ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారంనాడు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా భూపోరాట ఉద్యమాన్ని చేపట్టిన తమ నాయకుడిని అరెస్టు చేయడాన్ని వారు నిరసించారు. పలు చోట్ల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సిపిఐ కార్యకర్తలు హైదరాబాద్లోని లిబర్టీ సెంటర్లో రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో సిపిఐ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పేదల కోసం భూపోరాటం చేస్తున్న తమ నాయకులను అరెస్టు చేశారని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆయన అన్నారు. కరీంనగర్లో కూడా సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్లో రాస్తారోకో నిర్వహించారు.