తెలంగాణ వెనుకబాటును రూపుమాపుతాం: వైయస్
కరీంనగర్: తెలంగాణపై తమ పార్టీ నేత సోనియా గాంధీ నిర్ణయం తీసుకునేలోగా తెలంగాణ వెనకబాటుతనాన్ని రూపుమాపటడానికి తాము శాయశక్తులా కృషి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. తెలంగాణ అంశాన్ని అన్ని పార్టీలు సోనియా చేతిలో పెట్టాయని, త్యాగనిరతి, విశ్వసనీయత గల సోనియా గాంధీ తెలంగాణకు న్యాయం చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణ వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. కృష్ణా డెల్టా కన్నా ఎక్కువ లాభాలు అందేలా తెలంగాణను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణలో తాము చేపట్టిన, చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు. మిడ్ మానేరు నిర్వాసితులకు వీలైనంత ఎక్కువ నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిరిసిల్లకు 33 కోట్ల రూపాయలతో మంచినీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టామని, వేములవాడకు 9 కోట్ల రూపాయలతో మంచినీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టిన ఘనత తమదేనని ఆయన చెప్పారు. అన్ని వర్గాలవారిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సిరిసిల్ల చేనేతకార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని ఆయన చెప్పారు. ఆప్కోను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యం చేశామని, దాన్ని బలోపేతం చేసి చేనేత కార్మికులకు మేలు చేసే విధంగా తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో కార్మిక శాఖకు తగిన మంత్రి లేడని ఆయన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును ఉద్దేశిస్తూ పరోక్షంగా అన్నారు.