తెలంగాణకు కట్టుబడి వున్నాం: కేశవరావు
కరీంనగర్: తాము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి వున్నామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. తమ పార్టీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధితో పాటు తెలంగాణ ఏర్పాటును కూడా పరిగణనలోకి తీసుకున్నదని ఆయన చెప్పారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జరిగిన పార్టీ ఎన్నిక ప్రచార సభలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తమ నాయకుల్లో ఎవరు కాదన్నారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ వల్లనే, సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, తెరాస అభ్యర్థి కె. చంద్రశేఖరరావు ఇప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన అడిగారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోగా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కలిసే వున్నాయని ఆయన చెప్పారు. ఈ సభలో కరీంనగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్రెడ్డి కూడా మాట్లాడారు. చంద్రశేఖరరావుపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు.