భార్య చివరిచూపు దక్కక ఇద్దరిని హత్య చేసిన వ్యక్తి
అనంతపురం: మరణించిన భార్యను చివరిచూపు చూడనీయలేదనే ఆగ్రహంతో ఒక వ్యక్తి ఇద్దరిని నరికి చంపాడు. మరొకరిని గాయపరిచాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో జరిగింది. రామాంజనేయులు, నాగవేణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి నాగవేణి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. రామాంజనేయులు, నాగవేణి గొడవపడ్డారు. దీంతో నాగవేణి 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది.
పుట్టింటిలో నాగవేణి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మరణించింది. ఆమె మృతదేహానికి యాడికి స్మశానవాటికలో అంత్యక్రియలు జరిపారు. ఈ సమయంలో స్మశానవాటికకు చేరుకున్న రామాంజనేయులు తన భార్యను కనీసం చివరిసారిగానైనా చూడనీయలేదని ఆగ్రహం చెందారు. ఆ ఆగ్రహంతో అతను నాగవేణి అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మలను వేటకొడవలితో నరికాడు. దీంతో నాగవేణి అమ్మమ్మ, తాతయ్య మరణించారు. పెద్దమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వారిని హత్య చేసిన తర్వాత రామాంజనేయులు పోలీసులకు లొంగిపోయాడు.