ఎన్కౌంటర్లపై ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్కౌంటర్లు బూటకమని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో సోమవారం ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, జాతీయ మానవహక్కుల కమీషన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రశేఖర్ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు.
ఎన్కౌంటర్లు చేసిన పోలీసులకు ఆగ్జిల్లరీ ప్రమోషన్లు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయించాలని, ప్రతి ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని, ఎన్కౌంటర్లో మరణించినవారి పోస్టుమార్టమ్ ప్రక్రియను వీడియోలో చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని తాను సుప్రీంకోర్టును కోరినట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఎన్కౌంటర్లలో నిరాయుధులైన రైతులు ప్రాణాలు కోల్పోవడాన్ని, తమ తప్పిదాన్ని డిజిపి స్వరణ్జిత్ అంగీకరించిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించినట్లు ఆయన చెప్పారు. మే 5వ తేదీన తన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ అదనపు పత్రాలను సమర్పించాలని ఆదేశించిందని, ఆ మేరకు తాను వాటిని సమర్పించానని ఆయన అన్నారు.