కస్టమ్స్ చేతిలో ఐశ్వర్య డబ్బుల మూట
ముంబాయి: బాలీవుడ్ అందాలనటి ఐశ్వర్యారాయ్ చిక్కుల్లో పడ్డారు. ఆమెకు ముంబాయి కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేసే అవకాశం వుంది. దక్షిణ ముంబాయిలోని బాంద్రాలో గల ఆమె నివాసం చిరునామాకు ఆమె పేర 23 వేల యూరోలతో (దాదాపు 13.5 లక్షల రూపాయలతో) ఒక పార్సిల్ వచ్చింది. దీన్ని ముంబాయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ పాకెట్ నెదర్లాండ్స్ నుంచి వచ్చింది. అయితే ఎవరు పంపారనే విషయాన్ని వెల్లడించడం లేదు. తాము ఐశ్వర్యారాయ్కు ఇంకా నోటీసులు పంపలేదని, తర్వాత పంపిస్తామని కస్టమ్స్ (దిగుమతులు) కమీషనర్ ఎ.కె. ప్రసాద్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. చౌకబారు ప్రచారం పొందడానికి కూడా ఈ పని చేసి వుండవచ్చుననే విషయాన్ని తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.
విదేశాల్లో ఇచ్చిన ప్రదర్శనలకు ఐశ్వర్యకు రావాల్సిన మొత్తమైన అయి వుండవచ్చునని కస్టమ్స్ అధికారులు అంటున్నారు. ఎయిర్పోర్టు స్క్రీనింగ్లో యూరోలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని తాము ఐశ్వర్యారాయ్ కార్యదర్శి హరిసింగ్కు తెలియజేశామని ప్రసాద్ చెప్పారు. పార్సిల్కు సంబంధించిన తనకు వార్త అని హరిసింగ్ అన్నారు. ఫోన్కాల్స్కు ఆయన సమాధానాలు ఇవ్వడం లేదు. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ల మాదిరిగా అతి ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లించేవారిలో ఐశ్వర్యారాయ్ కూడా ఒకరు. 2005లో ఆమె 15 కోట్ల రూపాయల సంపాదనకు గాను 4 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు. 2003లో ఆమె 6.25 కోట్ల రూపాయల సంపాదనకు 2.45 కోట్ల పన్ను చెల్లించారు.