కెసిఆర్ను నమ్మేదెవరు? : కేశవరావు
విజయనగరం: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కె. చంద్రశేఖరరావు మాటలు నమ్మేదెవరని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అడిగారు. కెసిఆర్ తెలంగాణపై ఇదివరకు చాలా గడువులు పెట్టారని, ఏవీ జరగలేదని, అందువల్ల కెసిఆర్ను ఎవరు నమ్మరని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బొబ్బిలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. బొబ్బిలి ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని ఆయన అన్నారు.
బొబ్బిలి ఫలితాన్ని బట్టి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఏ మేరకు ఉందో తెలుస్తుందని, ఈ ఎన్నికలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం వెల్లడవుతుందని ఆయన అన్నారు. అందువల్ల తాము ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నిక విభిన్నమైందని, ఈ ఎన్నికలో తెలంగాణ అంశం పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుపై సమగ్ర అధ్యయనం జరగాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక మండళ్ల వల్ల రైతులకు కలిగే నష్టాన్ని, పరిశ్రమలకు కలిగే లాభాన్ని బేరీజు వేయాల్సి వుంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు సంతృప్తికరంగా ఉండడం వల్లనే ప్రపంచబ్యాంకు షరతులు లేని రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చిందని ఆయన అన్నారు.