భారత్, పాక్ల ఉగ్రవాద వ్యతిరేక యంత్రాంగం
న్యూఢిల్లీ: సంయుక్త ఉగ్రవాద వ్యతిరేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి భారత, పాకిస్థాన్ దేశాలు అంగీకరించాయి. ఇందులో ఇరు వైపుల నుంచి ముగ్గురేసి అధికారులు వుంటారు. దీనికి అదనపు కార్యదర్శి హోదా అధికారి నేతృత్వం వహిస్తాడు. దీనికి ఉభయ దేశాల విదేశాంగ కార్యాలయాలు సహకరిస్తాయి. భారత విదేశాంగ కార్యదర్శి శివశంకర్ మీనన్తో చర్చలు జరిపిన అనంతరం పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి రియాజ్ మొహమ్మద్ ఖాన్ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ విషయం చెప్పారు.
దేశంలో ఉగ్రవాద దాడులకు సంబంధించి భారత్ కొంత మెటీరియల్ ఇచ్చిందని, దాన్ని పరిశీలిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిర్దిష్టమైన సమాచారం ఉన్నప్పుడు పరస్పరం మార్పిడి చేసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. సియాచిన్పై చర్చలు జరుగుతున్నాయని, మరింత చర్చ జరగాల్సి వుందని ఆయన చెప్పారు. ముంబాయి బాంబు పేలుళ్లకు సంబంధించి తమ పాత్రపై భారత్ ఏ విధమైన సాక్ష్యాలు చూపలేదని ఆయన అన్నారు. పరస్పరం అస్థిరపరుచుకోవడానికి ప్రయత్నిస్తే ఉభయ దేశాలకు కూడా ప్రమాదకరమేనని ఆయన అభిప్రాయపడ్డారు.