అవినీతి కాంగ్రెస్కు గుణపాఠం ఖాయం: టిడిపి
కరీంనగర్: అవినీతి కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెబుతారని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. పార్టీ అభ్యర్థి ఎల్. రమణ గురువారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన దేవేందర్ గౌడ్ కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెస్ రెండున్నరేళ్లలో చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామని ఆయన చెప్పారు. కరీంనగర్లో తమ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణలో చైతన్యం పెరిగిందని, ఏదో మేరకు తమ ప్రభుత్వాల హయాంల్లోనే తెలంగాణకు న్యాయం జరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ నాయకులుగా తాము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజల్లో పట్టుకోల్పోతున్నాయని, ఆ పట్టును తిరిగి పొందడానికే ఈ ఎన్నికను ఆ పార్టీలు తెచ్చాయని ఆయన అన్నారు.