కెసిఆర్కు రూ. 70 కోట్ల ఎన్నారై డబ్బులు: కెకె
హైదరాబాద్: కరీంనగర్ ఉప ఎన్నికలో ఖర్చు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, పార్టీ అభ్యర్థి కె. చంద్రశేఖరరావు ఇప్పటికే ప్రవాసాంధ్రుల నుంచి 70 కోట్ల రూపాయలు సేకరించారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు ఆరోపించారు. కరీంనగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీగా ఖర్చు పెడుతోందని చంద్రశేఖరరావు చేసిన విమర్శకు ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. చంద్రశేఖరరావు ఎన్నారైల నుంచి సేకరించిన విరాళాలకు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన అన్నారు. ఆ మొత్తాన్ని చంద్రశేఖరరావు ఎప్పుడు ఖర్చు పెడతారనేది తనకు తెలియదని ఆయన అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్తో రాకపోతే ఐదుగురు పార్లమెంటు సభ్యులున్న తెరాసతో ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. రెండో ఎస్సార్సీకి కెసిఆర్ అంగీకరించి వుంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తాము బిజెపిని విశ్వసించబోమని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టిన తర్వాత మద్దతు ఇవ్వకపోతే ఓడిపోతుందని, అప్పుడు తమను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణపై తమ వైఖరి స్పష్టంగా వుందని ఆయన చెప్పారు. గడ్డం వుండడం వల్ల తాను దొంగలా కనిపిస్తున్నాను కదా అని ఛలోక్తి విసిరారు. కరీంనగర్లో ప్రధాన పోటీ తమకు, తెరాసకు మధ్యనే వుంటుందని ఆయన చెప్పారు. కరీంనగర్లో తమ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్కు తాము పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు.