అభిమానంమే గెలిపిస్తుంది: అప్పలనాయుడు
విజయనగరం: బొబ్బిలి లోక్సభ ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. తమ పార్టీ మీద ఉన్న అభిమానమే బొబ్బిలిలో తనను గెలిపిస్తుందని కొండపల్లి అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలపై ఉన్న నమ్మకం, తమ కుటుంబంపై ఉన్న అభిమానం తనను ఎన్నికల్లో గెలిపిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలిచ్చి సంక్షోభ కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. బిజెపి అభ్యర్థి పాకల సన్యాసిరాజు కూడా గురువారం బొబ్బిలి నియోజకవర్గానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి బొత్సా ఝాన్సీ బుధవారంనాడే నామినేషన్ దాఖలు చేశారు.