తాడిపత్రిలో విధ్వంసం: గాలిలోకి కాల్పులు
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రోడ్డు విస్తరణలో భాగంగా గురువారంనాడు ఒక ప్రార్థనామందిరాన్ని కూల్చివేసే సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విధ్వంసానికి దిగిన దుండగులను చెదరగొట్టడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ప్రార్థనామందిరం కూల్చివేతను అడ్డుకోవడానికి ఒక వర్గంవారు కూల్చివేతకు ఉపయోగించే వాహనాన్ని పెట్రోలు పోసి దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. వాహనం ఆపరేటర్ను, అతని అనుచరులను తరిమికొట్టారు. మరో వర్గంవారి దుకాణాలను, ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఇరు వర్గాల వారు పరస్పరం బాంబులు, రాళ్లు రువ్వుకున్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి సోదరుడు జె.సి. దివాకర్రెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఈ సమయంలో జెసి ప్రభాకర్ రెడ్డి గన్మన్ గాలిలోకి కాల్పులు జరిపారు. దివాకర్రెడ్డి వాహనాలపైకి రాళ్లు రువ్వారు. దివాకర్రెడ్డి అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీవారు, మైనారిటీ వర్గంవారితో కలిసి ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా వుండడంతో జిల్లా పోలీసు సూపరింటిండెంట్ కూడా అక్కడికి చేరుకున్నారు. రోడ్డు విస్తరణకు ప్రహారిగోడను మాత్రమే కూలుస్తున్నామని, ప్రార్థనామందిరానికి ఎటువంటి హానీ వుండదని అధికారులు చెబుతున్నారు. తాడిపత్రిలో పెద్దయెత్తున పోలీసులను మోహరించారు.