తమిళనాడులో సెలవుదినంగా తెలుగు ఉగాది
చెన్నై: తమిళనాడులో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడులో ప్రభుత్వ సెలవుదినాల జాబితాలో ఉగాది పర్వదినాన్ని కూడా చేరుస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం సెలవులు ఎక్కువగా వున్నాయంటూ 2001లో జయలలిత ప్రభుత్వం ఉగాదిని సెలవు దినాల జాబితాలోంచి తొలగించారు. ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డియంకె ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగాదిని తిరిగి సెలవు దినాల్లో చేర్చారు.
ఉగాదిని సెలవు దినాల జాబితా నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు తెలుగు సంఘాలు నిరసనలు చేపట్టిన జయలలిత ప్రభుత్వం హయాంలో లాభం లేకపోయింది. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రాంతాలు ఉన్నప్పటి నుంచి ఉగాదిని సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది. హోసూరు శాసనసభ్యుడు గోపినాథ్, తెలుగు సంఘాల నాయకులు చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉగాదిని సెలవుదినంగా ప్రకటించింది.