తెలంగాణ మద్దతును పార్లమెంటులోనే చెప్తా: అద్వానీ
న్యూఢిల్లీ: పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పెడితే తాము బలపరుస్తామని తమ పార్టీ జాతీయ నాయకుడు ఎల్.కె. అద్వానీ చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర నూతన అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. ఇంతకు పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా పని చేసిన ఎన్. ఇంద్రసేనారెడ్డి, కరీంనగర్ లోక్సభ పార్టీ అభ్యర్థి సిహెచ్. విద్యాసాగరరావులతో పాటు దత్తాత్రేయ శుక్రవారంనాడు తమ పార్టీ సీనియర్ నేతలు అటల్ బిహారీ వాజ్పేయిని, ఎల్.కె. అద్వానీని కలుసుకున్నారు. తమ నేతలతో భేటీ అయిన అనంతరం దత్తాత్రేయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వచ్చే పార్లమెంటు సమావేశంలో తెలంగాణ బిల్లుపై తాను ప్రస్తావిస్తానని, బిల్లు పెడితే తాము బలపరుస్తామని స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేస్తానని అద్వానీ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. బిజెపిని తాము నమ్మబోమని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో నేరుగా పార్లమెంటు సమావేశంలో విషయాన్ని ప్రస్తావిస్తానని అద్వానీ చెప్పారని ఆయన అన్నారు. పార్లమెంటులో తాము ప్రస్తావించడం వల్ల తెలంగాణపై కాంగ్రెస్ నీతి బట్టబయలవుతుందని ఆయన అన్నారు.