ఎన్నారై డబ్బులపై కెకె విజ్ఞతకే వదిలేస్తున్నా: కెసిఆర్
కరీంనగర్: తాను ప్రవాస భారతీయుల నుంచి (ఎన్నారైల) 70 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చేసిన ఆరోపణను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కరీంనగర్ లోక్సభ అభ్యర్థి కె. చంద్రశేఖఱరావు అన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానానికి ఆయన శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. మోసపూరిత విధానాలతో ముందుకు వస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.
కరీంనగర్ ఫలితం తెలంగాణవాదంపైననే ఆధారపడి వుందని ఆయన అన్నారు. తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే మెజారిటీ ఎంత వస్తుందో చెప్పలేనని ఆయన అన్నారు. నామినేషన్ వేసిన అనంతరం గిట్టుబాటు ధర కోసం చెరుకు రైతులు ప్రదర్శన నిర్వహిస్తున్న శిబిరాన్ని ఆయన సందర్శించారు. గిట్టుబాటు ధర కోసం చెరుకు రైతులు చేస్తున్న ఆందోళనకు తమ మద్దతు వుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే అంగీకరిస్తారని, ఇది మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల తీర్పు అని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటును వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు తర్వాత విభిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.