మరీ, ఫోన్లు చేసి ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం చందోలి గ్రామ సర్పంచ్ కటారి సురేందర్ రావు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. తన అంత్యక్రియలకు రావాలని సన్నిహిత బంధువులందరికీ చెప్పి ఆయన మరీ ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేసి ఆయన గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం రాత్రి ఆయన జగిత్యాలలో లాడ్జి తీసుకుని వున్నారు. అక్కడి నుంచే అందరికీ ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన అంత్యక్రియలకు రావాలని చెప్పాడు. అవతలివారు మాట్లాడేందుకు సురేందర్ రావు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.
సురేందర్రావు భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించి చందోలి గ్రామానికి తరలించారు. అప్పటికే బంధుమిత్రులు ఆ ఊరు చేరుకున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద యెత్తున కార్యకర్తలను తరలించడానికి గురువారం మధ్యాహ్నం దాకా ఏర్పాట్లు చేసిన సురేందర్ రావు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సురేందర్ రావు మానసిక స్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.