వరద ప్రాంతాలకు తక్షణం రూ.50 కోట్లు: సిఎం
హైదరాబాద్: వరదలతో అతలాకుతలం అయిన కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో పునరుద్ధరణ చర్యల కోసం అత్యవసర సహాయం కింద 50 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి డాక్టర్ వై. ఎస్. రాజశేఖరరెడ్డి శనివారంనాడు ఇక్కడ ప్రకటించారు. వరదల వల్ల ఆయా జిల్లాలలో ఏర్పడిన పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ఉపాధి హామీ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. వరదల వల్ల దెబ్బతిన్న ప్రభుత్వ ఆస్తులు, రహదారులు తదితర అంశాలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేసిందని ముఖ్యమంత్రి కలెక్టర్లను అభినందించారు. రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని వారికి విత్తనాలు అందుబాటులో ఉంచాలని రాజశేఖరరెడ్డి సూచించారు. డ్రైన్ల పూడికలను యుద్ధప్రాతిపదికన తీసివేయించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ. 50 కోట్ల ప్యాకేజీలో 37.5 కోట్ల రూపాయలను శనివారంనాడే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.