హుడా వేలం పాటల నిలిపివేత: సిపియంవారి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ (హుడా) వేలం పాటలను సిపియం కార్యకర్తలు బుధవారంనాడు అడ్డుకున్నారు. వేలం పాటలను అడ్డుకోవడానికి హుడా కార్యాలయం ఎదుట సిపియం కార్యకర్తలు బైఠాయించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాదులాట జరిగింది. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. అనంతరం వారిని పోలీసులు అరెట్టు చేశారు.
నగరంలోని, నగర శివారుల్లోని భూములను వేలం వేసి 15 వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు సమర్పించాలని హుడా తలపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాదులోని బేగంపేట హుడా కార్యాలయంలో వేలం పాటలు నిర్వహించాలని తలపెట్టారు. దీన్ని అడ్డుకునేందుకు సిపియం కార్యకర్తలు ప్రయత్నించారు. సిపియం ఆందోళనతో వేలంపాటలు ఆదిపోయాయి. తెలంగాణ రాష్ట సమితి (తెరాస) నాయకులు, కార్యకర్తలు కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ భూములు అమ్మితే సహించబోమని తెరాస హెచ్చరించింది.