హైదరాబాద్ పేలుళ్లు: పాక్ లో బిలాల్ హతం?
హైదరాబాద్: హైదరాబాదులోని మక్కా మసీదు, జంట పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి బిలాల్ అలియాస్ షాహిర్ ను పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్సై కాల్చి చంపినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాకిస్థాన్ వార్తాపత్రికలు రాశాయి. కరాచీలోని వాటర్ పంపు ప్రాంతంలో మోటారు సైకిలుపై వెళ్తుండగా కాల్పుల్లో మరణించినట్లు ఆ వార్తలు వెలువడ్డాయి. బిలాల్ కోసం హైదరాబాదు పోలీసులు ఇంటర్ పోల్ లో రెడ్ కార్నర్ జారీ చేశారు. అయినా పోలీసులు అతన్ని పట్టుకోలేకపోయారు. బిలాల్ హైదరాబాదులోని మూసారాంబాగ్ ప్రాంతానికి చెందినవాడు. అతను హుజి అనే సంస్థకు పనిచేస్తున్నాడు. హైదరాబాదులో జరిగిన అన్ని తీవ్రవాద కార్యకలాపాలతో బిలాల్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాదులో అతను హార్డ్ వేర్ దుకాణం నడిపేవాడు. బిలాల్ పట్టుబడితే పాక్ గుట్లన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అతన్ని కాల్చి చంపినట్లు భావిస్తున్నారు.
బిలాల్ 8 ఏళ్ల క్రితం అజ్ఞాతంలో వెళ్లాడు. ఇతను సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో ఉంటూ భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. హైదరాబాదులోని లుంబినీ పార్కులో, గోకుల్ చాట్ లో పేలుళ్లు సంభవించిన ఐదు రోజులకు ఆగస్టు 30వ తేదీన ఐఎస్సై కాల్చి చంపినట్లు పాకిస్థాన్ వార్తాపత్రికలు రాశాయి. బిలాల్ హత్యకు సంబంధించి హైదరాబాదులోని అతని తల్లిదండ్రులకు సమాచారం అందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే వారు మీడియాతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు.