బిలాల్ మృతిపై అధికారిక సమాచారం లేదు: బల్వీందర్
హైదరాబాద్: పాకిస్థాన్ లోని కరాచీలో హైదరాబాదుకు చెందిన ఉగ్రవాది షాహెద్ అలియాస్ బిలాల్ హతమైనట్లు తమకు అధికారిక సమాచారమేదీ లేదని హైదరాబాద్ పోలీసు కమీషనర్ బల్వీందర్ సింగ్ అన్నారు. తాను టీవీల్లోనే ఆ వార్త చూశానని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. హైదరాబాదులో బందోబస్తు బాగానే ఉందని, సరిపోయిన బలగాలున్నాయని ఆయన అన్నారు.
కరాచీలోని చౌరంగీ వాటర్ పూల్ వద్ద కాల్పుల్లో మరణించిన వ్యక్తి హైదరాబాదు బిలాల్ కాకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. మరణించిన వ్యక్తి పేరు బిలాలే అయినప్పటికీ అతనిది పాకిస్థాన్ లోని పెషావర్ కు చెందినవాడని అంటున్నారు. అతని తండ్రి పేరు సలీం అని చెబుతున్నారు. హైదరాబాదుకు చెందిన బిలాల్ తండ్రి పేరు వాహెద్. బిలాల్ మరణానికి సంబంధించి తనకేమీ తెలియదని బిలాల్ తండ్రి వాహెద్ అంటున్నాడు. చాలా కాలంగా తన కుమారుడు షాహెద్ కనిపించడం లేదని ఆయన అన్నారు.