పిసిసి పెద్ద రాజకీయం, తర్వాత మాట్లాడ్తా: కెకె
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి)కొత్త అధ్యక్షుడి ఎంపిక రాజకీయపరమైన అంశమని, దాని గురించి వివరంగా మీడియాతో మాట్లాడుతానని పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు అన్నారు. ఢిల్లీ నుంచి గురువారం హైదరాబాదు వచ్చిన ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్దకు వెళ్లాను. రాజశేఖర రెడ్డిని తాను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని, తాను రాజీనామా చేసే విషయం ముఖ్యమంత్రికి ముందే చెప్పానని, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కలువలేదని, దాంతో ఇప్పుడు మర్యాదపూర్వరంగా కలిశానని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం మొదట మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి నిరాకరించి కొంత దూరం వెళ్లిపోయారు. ఆ తర్వాత వెనక్కి వచ్చి మిడియా ప్రతినిధులతో మాట్లాడారు. పిసిసి మార్పు గురించి మీడియా ప్రతినిధులు పదే పదే అడిగారు. అయితే అది చాలా పెద్ద రాజకీయాంశమని, ఇలా మాట్లాడడం సాధ్యం కాదని, వివరంగా మాట్లాడతానని ఆయన చెప్పి వెళ్లిపోయారు.