చంద్రబాబు నాయుడు అల్ప సంతోషం పార్టీ కొంప ముంచనుందా?
హైదరాబాద్: "అన్నీ మంచి శకునములే" అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పాడుకుంటూ ఉండవచ్చు. వైఎస్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే సంఘటనలు వరుసగా జరగడం ఆయనకు ఆనందం కలిగించవచ్చు. కాంగ్రెస్ లో వెంకట్ ( కేశవరావు కుమారుడు) వంటి వారు చాలామంది ఉన్నారని చంద్రబాబు నాయుడు సెలవిచ్చారు.
ప్రత్యర్ధులు బలహీనమవుతున్నందుకు చంద్రబాబు నాయుడు చంకలు గుద్దుకుంటున్నారే కానీ సమస్యల మీద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు స్పిరిటెడ్ గా ఉద్యమించేలా ఆయన చేయలేకపోతున్నారు. ఆ పని అసెంబ్లీ ఎన్నికల ముందు చెయ్యవచ్చన్న అలసత్వం కనిపిస్తోంది. ఆయన ఎన్నో కసరత్తులు చేసి నియమించుకున్న పార్టీ పోలిట్ బ్యూరోలో హరికృష్ణను చేర్చుకోవడం మినహా కొత్తదనం లేదు.
తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మొదటి నుంచీ మృగ్యమే. ఈ కారణం వల్ల పార్టీ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందని, ఇటువంటి ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసి పోయాయని రాజనీతి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని లోపాలున్నా, అంతర్గత ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండడం వల్ల మనుగడ సాగిస్తోందని వీరి అభిప్రాయం.
కొందరు పత్రికా మేధావుల సలహాలనే సర్వస్వంగా టిడిపి అధినేత ఇప్పటికీ భావించడం ఆ పార్టీ సీనియర్ నాయకులకు నచ్చడం లేదు. పత్రికలు, టీవీ చానళ్ళు ప్రజాభిప్రాయాన్ని కూడగట్టలేవని, వీటిని అతిగా నమ్ముకుంటే అధోగతేనని వీరు పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో సినిమా గ్లామర్ ను నమ్ముకుని తెలుగుదేశం పార్టీ ఘోరంగా దెబ్బతింది. ధర్మవరపు సుబ్రమణ్యం మినహా సినిమా వాళ్ళంతా అండగా ఉన్న తెలుగుదేశం విజయం సాధించలేకపోయింది.