నారాయణకు సైకిల్ స్వారీ తప్పలేదు
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు సైకిల్ సవారీ తప్పడం లేదు. రాష్ట్రంలో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలనుకున్న నారాయణ ఉత్సాహంపై సిపిఐ జాతీయ నాయకత్వం నీళ్లు చల్లింది. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఆయన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే తీర్మానాన్ని ఆయన ఆదివారం రాష్ట్ర సమితి సమావేశంలో ప్రతిపాదించారు. సిపిఐ, సిపిఎంలు రేపు పొత్తులపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని నారాయణ ఆదివారంనాడు చెప్పారు.
సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ఆదివారం నగరంలో ప్రారంభమయ్యాయి. రానున్న ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, పొత్తుల విషయమై ప్రధానంగా చర్చ జరుగనుంది. వచ్చే ఎన్నికల్లో తెదేపాతో పొత్తు కొనసాగించాలని సీపీఐ నేత నారాయణ సమితి సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ జరిగిన తరువాత సోమవారం పొత్తులపై పార్టీ వైఖరి ప్రకటించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో 24 శాసనసభా స్థానాలకు, మూడు పార్లమెంటు స్థానాలకు పోటీ చేయాలని సిపిఐ భావిస్తోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని సిపిఎంకు వదిలేసి మంగళగిరి సీటు అడగాలని కూడా అనుకుంటోంది.