కెసిఆర్ మనసేమిటో: రాఘవులు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని సిపిఎం రాష్టర్ కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, కెసిఆర్ చేస్తున్న ప్రకటనల్లో పొంతన లేదని, గందరగోళం ఉందని ఆయన అన్నారు. పొత్తులపై కెసిఆర్ తుది ప్రకటన చేసిన తర్వాతనే మాట్లాడుతామని ఆయన చెప్పారు. కాంగ్రెసును ఓడించాలనే తమ వైఖరిలో మార్పు లేదని, కెసిఆర్ తమతో కలిసి వస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ తన మనసు మార్చుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెల 10,11 తేదీల్లో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెలాఖరున సిపిఐ, సిపిఎం కేంద్ర నాయకత్వాలు సమావేశమై పొత్తులపై నిర్ణయం తీసుకుంటాయని, ఆ తర్వాత సిపిఐ, సిపిఎం రాష్ట్ర నాయకత్వాల మధ్య చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. సిపిఐతో పొత్తు కుదిరిన తర్వాతనే ఇతర పార్టీలతో పొత్తులపై చర్చిస్తామని ఆయన చెప్పారు. సిపిఎంకు రెండు సీట్లు మాత్రమే వస్తాయని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాము 9 సీట్లు పొందైనా సరే కాంగ్రెసును ఓడిస్తామని ఆయన అన్నారు.