మొయిలీ ఆ మాట అనలేదు: డిఎస్
వరంగల్: తెలంగాణపై తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ ప్రకటనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వీరప్ప మొయిలీ ప్రకటనను మీడియా సరిగా అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. వారంలోగా తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత కె. చంద్రశేఖర రావు ప్రకటనను మీడియా ప్రస్తావించినప్పుడు తనకైతే తెలియదని, పార్టీ నాయకత్వం అలాంటి ప్రతిపాదన చేసినట్లు తనకు తెలియదని మాత్రమే అన్నారని ఆయన వివరించారు.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తమ పార్టీ అధిష్టానవర్గం తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతోనే తకు పోటీ ఉంటుందని ఆయన చెప్పారు. తాము వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదివరకే చూసిన పార్టీగా తెలుగుదేశం పార్టీని ప్రజలు పరిగణిస్తే ప్రజారాజ్యం రెండో స్థానంలో ఉంటుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులనే ఎంపిక చేస్తామని, సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఆయన చెప్పారు.