డిఎస్ ప్రకటన వ్యక్తిగతం: మొయిలీ
హైదరాబాద్ : తెలంగాణపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. మెజారిటీ లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ఎలా ప్రవేశపెడతామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. యుపిఎ ప్రభుత్వ బలపరీక్ష సమయంలోనే మెజారిటీ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందని, ఇప్పుడు తెలంగాణ బిల్లు పెడితే అంతకన్నా కష్టమవుతుందని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నందుననే రాజకీయ పార్టీలు ప్రయోజనాల కోసం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాయని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత కె. చంద్రశేఖరరావు మోసం చేస్తున్నారని, యుపిఎ నుంచి బయటకు వెళ్లడం ద్వారా కెసిఆర్ ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేప్పేది ఏముందని వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. తమ పార్టీ వైఖరి ఎప్పుడో స్పష్టం చేశామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తాము ఇప్పుడు కొత్తగా చెప్పే విషయాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ఏకాభిప్రాయం కుదరలేదని శనివారం వీరప్పమొయిలీ పేర్కొన్నాయి. మొయిలీ ప్రకటనపై తెరాస నేతలు మండిపడ్డారు.