భూటాన్ పై ఐటీ బడా సంస్ధల కన్ను
థింఫు: భూటాన్ లో బిపివోలు, డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్, జెన్ ప్యాక్, మైక్రోసాఫ్ట్ లు ఆసక్తి చూపిస్తున్నాయి. భూటాన్ లో పెట్టుబడి అవకాశాల పరిశీలనకు భారతదేశానికి చెందిన 30 ప్రముఖ ఐటీ కంపెనీలు ఇటీవల ఒక సమావేశం నిర్వహించాయి.
భూటాన్ లో డేటా సెంటర్స్ ఆపరేషన్, డిజాస్టర్ రికవరీ సెంటర్, బిపివోలు, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్లు నెలకొల్పవచ్చని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. "పెట్టుబడి పెట్టదగిన ఉత్తమ ప్రదేశంగా భూటాన్ కనిపిస్తోంది" అని ఇన్ఫోసిస్ బోర్డ్ చైర్మన్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. భూటాన్ లోని గొప్పదనాన్ని గ్రహించడం ప్రారంభించిన తర్వాత మీ కళ్ళ ముందే అవకాశాలు కనిపిస్తాయని ఆయన అన్నారు.
భూటాన్ వంటి చిన్న దేశం ఐటి కేంద్ర బిందువుగా ఎలా మారగలదన్న ప్రశ్నను ఆయనే వేసి, దానికి జవాబును కూడా ఆయనే ఇచ్చారు. ఏడుగురితో ప్రారంభమైన ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పుడు ఐదు బిలియన్ డాలర్ల సంస్ధగా ఎదిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
"మా దీర్ఘ కాలిక ఐటీ వ్యూహాన్ని రూపొందించుకోవడంతో పాటు భారత్ తో భాగస్వాములు కాగలిగిన కొత్త దేశాలను సందర్శిస్తున్నాం. భూటాన్ కంపెనీలతో కలిసి పని చేయవచ్చు, లేదా ఐసిటి కంపెనీలను ఏర్పాటు చేయడంలో భూటాన్ కు సహకరించవచ్చు" అని నాస్కామ్ చైర్మన్ గణేష్ నటరాజన్ చెప్పారు.