ఆయేషా తల్లికి లీగల్ నోటీసు
విజయవాడ : ఆయేషామీరా హత్య కేసు తేలటం మాట అటువుంచి రోజకో విచిత్రమైన మలుపు తీసుకుంటోంది.తాజాగా ఆయేషా తల్లి షంషాద్ బేగంకు నోటీసులు పంపుతున్నారు. ఆ హత్య కేసులో తన ప్రమేయం లేదని దర్యాప్తు సంస్థలు నిర్థారించినా పదేపదే ఆరోపణలు చేయడం, తన పేరును ఉటంకిస్తూ కేసు పునర్విచారణకు కోర్టులో ఫిటీషన్ దాఖలు చేయడం వంటి కారణాలపై ఆయేషా తల్లి షంషాద్ బేగంకు నోటీసు పంపుతున్నట్టు రాష్ట్ర పురపాలక మంత్రి కోనేరు రంగారావు మనవడు, గూడవల్లి గ్రామ సర్పంచి కోనేరు సతీష్ తెలిపారు.
మంగళవారం కృష్ణా జిల్లా గూడవల్లిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయేషా హత్య కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు శవరాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు.ఆ హత్యలో తనకు ఎంతమాత్రం ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. తన తాత కోనేరు రంగారావు క్యాబినెట్ మంత్రి కావడం, తాము దళితులమనే భావనతోనే దేశం నేతలు ఆ కేసుతో తమను పదేపదే అంటగడుతున్నారని ఆయన చెప్పారు.
గతంలో పోలీసుశాఖ అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత తన ప్రమేయం లేదని నిర్థారించిందన్నారు. అయినా దేశం నేతలు ఆరోపణలు చేయడం శోచనీయమని, తాను నార్కో పరీక్షలకు కూడా సిద్ధమని చెప్పారు. నమ్మకం లేకుంటే నార్కో పరీక్షల నిర్వహణ టివీల్లో నేరుగా చూపించినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఈ పరీక్షల్లో తనకు సంబంధం ఉందని తేలితే యాసిడ్దాడి కేసు నిందితుల మాదిరి ఎన్కౌంటర్ చేసుకోవచ్చని చెప్పారు.