ఠాగూర్ లా పోరాడండి:చిరు పిలుపు
దర్శిలో ప్రసంగిస్తూ.. ఎందరు మహిళలు ఇప్పటివరకు లక్షాధికారులు అయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు బర్రెలు, గొర్రెలు ఇస్తూ వారు మాత్రం సెజ్లు, గనులు కొట్టేస్తున్నారు. రాష్ట్రానికి అవినీతి గ్రహణంలా పట్టుకుంది. గ్రహణాన్ని చూడకుండా ఉండటానికి నల్లటి కళ్లద్దాలు పెట్టుకుంటాం. ప్రజాకర్షక పథకాల పేరిట కళ్లద్దాలు కాదు ఏకంగా పేదల కళ్లే కప్పేస్తున్నారు. వారు మాత్రం కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాకర్షక పథకాలకు కాలం చెల్లింది. ప్రజల్లో మార్పు వస్తోంది. మోసాలు ఎల్లకాలం కొనసాగవు అని ఉద్ఘాటించారు. రాష్ట్రాన్ని ఇద్దరు దోచుకుంటున్నారు. మూడో వ్యక్తి రావటం వారికి ఇష్టం లేదని విమర్శించారు. ప్రజారాజ్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
ఆ తర్వాత ఒంగోలులో ప్రసంగిస్తూ...అడిగిందే తడువుగా అనేక ప్రధాన కాంట్రాక్టులను సత్యం కంప్యూటర్స్ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టడాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తీవ్రంగా ఖండించారు. ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలించకుండా ప్రాజెక్టులు, పోర్టులు, మెట్రోరైలు ప్రాజెక్టు వంటి వాటిని కేటాయించడంలో ప్రభుత్వ వాటా ఎంత ఉందో ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజల ఆస్తులకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వాధినేతలే దళారులుగా వ్యవహరిస్తూ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. తన వెనుక ఉన్న కుర్రకారు కదిలితే పాలకులు కుర్చీలుకదులుతాయని హెచ్చరించిన చిరంజీవి ఆ మార్పు త్వరలో రానుందన్నారు.