మాలల సింహగర్జన నేడే
రాజమండ్రి:నేడు(ఆదివారం)జరగనున్న రాష్ట్ర మాలల సింహగర్జనకు హాజరయ్యేందుకు ప్రధాననాయకులంతా రాజమండ్రికి చేరుకున్నారు. ప్రధాన డిమాండ్లను చర్చించేందుకు వివిధ యూనివర్శిటీల నుంచి ప్రొఫెసర్లుతో పాటు మేధావులు వచ్చారు. మాలలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని,వివిధ రాజకీయ పార్టీలతో మాలలకు జరుగుతున్న అన్యాయాలపై మాలలు గర్జిం చనున్నారు. రాష్ట్ర మాల మహానాడు నాయకులు కారెం శివాజీ, మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు చేరుకొని ఏర్పాట్లను సమీక్షించి,జిల్లా నాయకులతో చర్చలు జరిపారు.
అమలాపురం ఎంపీ జివి హర్షకుమార్ వివిధ యూనివర్శిటీ ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహించారు. వర్గీకరణపై ప్రభు త్వం చూపుతున్న చొరవను ఆయన తప్పుబట్టారు. కీలక నాయకు లు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఐఎఎస్ దానంతో ఏర్పాట్లు సమీక్షించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది మాలలు సభకు హాజరు కావచ్చుననే అంచనాలు వేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.గర్జన నిమిత్తం పట్టణమంతా నీలిరంగుతో అలంకరించారు. అలాగే ఆహ్వాన బ్యానర్లతో నగర ప్రధాన కూడళ్ళను నింపారు.
మాలల సింహగర్జన సభకు ఆటంకం కలిగించాలని వాహన యజమానులను బెదిరించి ఆపినా తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని మాల మహాసభ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో హెచ్చరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల కోసం వర్గీకరణ వాదాన్ని పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో రాష్ట్ర అధ్యక్షులు మల్లెల వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు మాదే రామచంద్రరావులు వున్నారు.