'పచ్చ' పందికొక్కులు:వైఎస్
గత ఎన్డిఎ ప్రభుత్వం పనికి ఆహార పథకం కింద బియ్యాన్ని సరఫరా చేస్తే అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి పార్టీ నేతలు, పచ్చచొక్కా కాంట్రాక్టర్లు యంత్రాలతో పనులు చేయించి పేదల కడుపుకొట్టారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రైతులు, మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి శ్రేయస్సు కోసం పాటుపడిందని ఆయన చెప్పుకొచ్చారు. టిడిపి హయాంలో రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్యలు చేసుకుంటే చంద్రబాబు పట్టించుకోలేదని గుర్తు చేశారు.
రైతులేనిదే రాజ్యం లేదన్న నినాదంతో 63 లక్షల మంది రైతులకు చెందిన రూ.11,350 కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత మాదేనన్నారు. రుణం చెల్లించిన రైతులను కూడా ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో సకాలంలో అప్పులు తీర్చిన రైతులు ఒక్కొక్కరికి రూ.5 వేలు అందించామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా యేడాదికి ఒక్కొక్కరికి 8వేల రూపాయల ఆదాయం కల్పిస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా మెగా డిఎస్సీ ద్వారా 52వేల మంది అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఇవ్వనున్నామని, 37వేల పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.