'సత్యం'పై ప్రధాని సీరియస్
న్యూఢిల్లీ: సత్యం వ్యవహారాన్ని ప్రధాని మన్మోహన్ సింగ్ సీరియస్ గా తీసుకోవడంతో ఆర్వోసీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సెబీ రంగంలోకి దిగాయి. ఈ సంస్థల అధికారులు గత నాలుగైదు రోజులుగా 24 గంటలూ సత్యం డాక్యుమెంట్ల పరిశీలనలోనే ఉన్నట్లు తెలిసింది.
సత్యం కంప్యూటర్స్ కేసు రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ స్థాయిలోని చిన్న విషయం కాదని, ఇది అంతర్జాతీయ పర్యవసానాలున్న, భారతదేశ ప్రతిష్ఠకు సంబంధించిన అతి పెద్ద వ్యవహారమని కేంద్రం భావిస్తోంది. ఆర్థిక శాఖను స్వయంగా నిర్వహిస్తున్న ప్రధాని మన్మోహన్సింగ్ ఈ కుంభకోణంతో షాక్ తిన్నారు. రామలింగరాజు ప్రకటన ప్రకారం చూస్తే.. ఇందులో ఫెమా, ఐటీ చట్టం వంటివి తీవ్రఉల్లంఘనకు గురైనట్లుందని, అత్యున్నత ఆర్థిక సంస్థలపై మచ్చ పడిందని, ఇందులో అంతర్జాతీయ కోణం కూడా ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలోని రాజకీయ కోణం గురించి ఇంటెలిజన్స్ వర్గాలు ఆయనకు నివేదించినట్లు సమాచారం.
ప్రధాని దీనిని సీరియస్గా తీసుకోవడంతో ఆర్వోసీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సెబీ వంటి సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ మూడు సంస్థలకు చెందిన పది, పదిహేనుమంది అధికారులు గత నాలుగైదు రోజులుగా 24 గంటలూ సత్యం డాక్యుమెంట్ల పరిశీలనలోనే ఉన్నట్లు తెలిసింది. ఈ కుంభకోణంపై ఆర్వోసీ కేంద్రానికి ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించింది. మరో రెండు రోజుల్లో తుది నివేదికను కూడా సమర్పించనున్నట్లు తెలిసింది. ఎటు తిరిగి ఎటు వచ్చినా కేంద్రంలోనో, రాష్ట్రంలోనో పెద్ద తలకాయలకు ఈ కుంభకోణం చుట్టుకోక తప్పదని స్పష్టమవుతోంది.